‘జ్ఞానవాపి’ కేసు విచారణ వాయిదా

8 Oct, 2022 06:53 IST|Sakshi

వారణాసి: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్‌–డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై లిఖితపూర్వకంగా స్పందించాలని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీకి సూచించింది.

మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని, ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని విన్నవిస్తూ హిందూ మహిళ ఒకరు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీపీసీ) ఆర్డర్‌ 26 రూల్‌ 10 కింద ఈ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోర్టును కోరామని పిటిషనర్‌ తరపు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ చెప్పారు.
చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్‌

మరిన్ని వార్తలు