దళిత యువతి వీడియో క్లిప్‌పై హల్‌చల్‌

4 Oct, 2020 13:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై అత్యాచారాం చేసి, హత్య చేశారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా కలకలం చెలరేగుతోన్న విషయం తెల్సిందే. కిరాతకులు తనను గొంతు నులిమి చంపబోయారంటూ అలీగఢ్‌ మున్సిపల్‌ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దళిత బాలిక వెల్లడిస్తోన్న వీడియోను బీజీపీ ఐటీ సెల్‌ విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా సోషల్‌ మీడియాకు విడుదల చేయడం కొత్త వివాదం రగులుతోంది. చదవండి: (ఇందిర గుర్తొస్తోంది : ఐరన్‌ లేడీ ఈజ్‌‌ బ్యాక్‌)

అత్యాచారం, హత్యాయత్నం కేసులో తీవ్రంగా గాయపడిన దళిత యువతి సెప్టెంబర్‌ 29న ఢిల్లీ ఆస్పత్రిలో మరణించగా, అంతకుముందు ఆమె మీడియా ప్రతినిథికి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్‌ను అమిత్‌ మాల్వియా అక్టోబర్‌ రెండవ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అత్యాచారం కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేయడం నేరం. ఆ దళిత యువతిపై నిజంగా అత్యాచారం జరిగిన పక్షంలో అమిత్‌ మాల్వియాపై కచ్చితంగా  తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ హెచ్చరించారు. యూపీ పోలీసులతోపాటు మాల్వియాతో తాను స్వయంగా మాట్లాడుతానని, అత్యాచారం ఆరోపణలు  నిజమైన పక్షంలో మాల్వియాపై తాము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని రేఖా శర్మ మీడియాతో వ్యాఖ్యానించారు. చదవండి: (ఎన్నాళ్లిలా:  చచ్చినా గౌరవం లేదు)

ఈ విషయంలో మాల్వియాపై తాము తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చీఫ్‌ విమ్లా బాతమ్‌ కూడా హెచ్చరించారు. బీజీపీ మహిళా మోర్చా, సోషల్‌ మీడియా చీఫ్‌ ప్రీతి గాంధీ మాత్రం మాల్వియాను వెనకేసుకొచ్చారు. మాల్వియా విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లో దళిత యువతి తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు తప్పా, అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు చేయలేదని ఆమె అన్నారు. నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో సుప్రసిద్ధుడైన అమిత్‌ మాల్వియా ఉద్దేశపూర్వకంగానే అత్యాచారం ఆరోపణలను తొలగించి దళిత యువతి వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారని కాంగ్రెస్, దళిత పార్టీలు ఆరోపిస్తున్నాయి. చదవండి: (న్యాయం జరిగేదాకా పోరుబాటే)

మరిన్ని వార్తలు