‘ఎయిమ్స్‌’ తరహాలో ‘ఐసీఎంఆర్‌’పై సైబర్‌ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం

6 Dec, 2022 16:59 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్‌పై సైబర్‌ దాడి జరిగి సర్వర్లు డౌన్‌ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్‌ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)పై సైబర్‌ దాడికి యత్నించారు హ్యాకర్స్‌. ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఐపీ అడ్రస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రేస్‌ చేయగా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీగా తేలిందన‍్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్‌ ఫైర్‌వాల్‌, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్‌ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు.

మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్‌ ముందు ఉన్న సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రిపై డిసెంబర్‌ 4న సైబర్‌ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్‌తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్‌ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్‌ శెర్వాల్‌ తెలిపారు. ఎన్‌ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. 

ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం!

మరిన్ని వార్తలు