ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!

20 Oct, 2020 04:12 IST|Sakshi

ప్రభుత్వ కమిటీ సభ్యుడు అగ్రవాల్‌

ముంబై: భారత జనాభాలో కనీసం సగం మందికి వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా సోకే ప్రమాదముందని కరోనా వైరస్‌ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే. సెప్టెంబర్‌ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని, సగటున రోజూ 61,390 కొత్త కేసులు నమోదౌతు న్నాయని తెలిపారు.

‘మేం అనుసరించిన మోడల్‌ అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఇప్పుడు దాదాపు 30 శాతం జనాభా కరోనా బారిన పడ్డారు, ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరవచ్చు’అని ప్రభుత్వ కమిటీ సభ్యులు, కాన్పూర్‌ ఐఐటికి చెందిన మణీంద్ర అగ్రవాల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్‌ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ఈ కమిటీ అంచనా వేసింది. అతి తక్కువ జనాభాతో సర్వే చేయడంతో, సీరోలాజికల్‌ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా లేవని అగ్రవాల్‌ తెలిపారు. సామాజిక దూరం, మాస్క్‌ ధరించడం నిర్లక్ష్యం చేస్తే కేసుల సంఖ్య ఒక్క నెలలో 26 లక్షలకు చేరే ప్రమాదముందని కమిటీ హెచ్చరించింది. దుర్గా పూజ, దీపావళి పండుగ సీజన్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు