అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’

19 May, 2023 04:12 IST|Sakshi

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అమెరికాలో సాగిస్తున్న న్యాయ పోరాటంలో భారత్‌కు అతిపెద్ద విజయం లభించింది. 2008 నవంబర్‌నాటి ముంబై ఉగ్రవాద దాడిలో ప్రధాన నిందితుడైన తహవుర్‌ రాణా(62)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా న్యాయస్థానం అంగీకరించింది. రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని ‘డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్‌ ద సెంట్రల్‌ డిస్ట్రిక్ట్ ఆఫ్‌ కాలిఫోర్నియా’ మేజిస్ట్రేట్‌ జడ్జి జాక్వెలిన్‌ కూల్జియన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఈ నెల 16వ తేదీన ఉత్తర్వు జారీ చేశారు. భారత్‌–అమెరికా మధ్య అమల్లో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద రాణాను భారత్‌కు అప్పగించాలని పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు నెల రోజుల ముందు తహవుర్‌ రాణాను భారత్‌కు అప్పగిస్తూ ఈ ఉత్తర్వు వెలువడడం గమనార్హం. పాకిస్తాన్‌ సంతతికి చెందిన తహవుర్‌ రాణాకు కెనడా పౌరసత్వం ఉంది.

 ఉగ్రవాదులకు సాయం చేశాడన్న ఆరోపణల కింద రాణాకు అమెరికాలోని షికాగో కోర్టు గతంలో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, రాణాను సాధ్యమైనంత త్వరగా, వేగంగా భారత్‌కు తరలించడానికి అమెరికా అధికారులతో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా గురువారం తెలిపారు. 

మరిన్ని వార్తలు