వాళ్ల ఫోటోలు గోడలకు వేలాడదీయండి: గడ్కరీ

29 Oct, 2020 11:00 IST|Sakshi

ప్రాజెక్టు ఆలస్యంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆలస్యానికి కారణమైన అధికారుల ఫోటోలు వేలాడదీయాలి!

సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టుల జాప్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్‌పూర్‌లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ భవనం నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలస్యానికి బాధ్యులైన అధికారుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు జాతీయ రహదారి అథారిటీలో తక్షణమే సంస్కరణలు అవసరమన్నారు. పనిచేయని ఉద్యోగులపై చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ  ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని కేవలం రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ప్రకటించిన ఆయన  కేవలం 250 కోట్ల ఈ ప్రాజెక్టును పూర్తికి జరిగిన ఆలస్యాన్ని ప్రశ్నించారు. అనవసరమైన గందరగోళాలను సృష్టించి జాప్యం చేస్తున్న అధికారుల ఫోటోలను సంబంధిత భవనం గోడలపై వేలాడదీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజలు ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ భవనం ప్రారంభోత్సవంగా సందర్బంగా అధికారునుద్దేశించి మాట్లాడుతూ "ఎలా పలకరించాలోఅర్థం కావడంలేదు.. మిమ్మల్ని అభినందించాలంటే నాగే సిగ్గుగా ఉందంటూ'' మొదలుపెట్టారు. ఎన్‌హెచ్‌ఏఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం తనకు అవమానకరంగా ఉందన్నారు. 2008లో ఈ భవన  నిర్మాణానికి నిర్ణయించాం. 2011లో టెండర్ పిలిచాం.. 200-250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 9 సంవత్సరాల కాలం పట్టిందని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారుల ఫోటోల భవన గోడలపై వేలాడదీస్తే.. ఆ అధికారుల నిర్వాకం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పని పూర్తి కావడానికి రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది అధ్యక్షులు మారారని ఆయన గుర్తు చేశారు. భవిషత్తులో ఈ లోపాలను సరిచేసుకుని, వేగంగా పనులు పూర్తి చేయల్సిన అవసరం ఉందని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు సూచించారు. 

మరిన్ని వార్తలు