‘హనుమాన్‌ చాలీసా’ చాలెంజ్‌.. ఎంపీ నవనీత్‌ కౌర్‌కు పోలీసుల నోటీసులు

22 Apr, 2022 21:10 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు కూడా నోటీసులు అందించారు.  సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ బయట హనుమాన్‌ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఇలా స్పందించారు.  

శుక్రవారం ఉదయం ముంబై నగరం చేరుకున్న రానా దంపతులు.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. వాళ్ల సవాల్‌ నేపథ్యంలో.. ముంబైకి శివసేన కార్యకర్తలు, ప్రత్యేకించి మాతోశ్రీ దగ్గర గుమిగూడారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కింద వాళ్లకు నోటీసులు జారీ చేశారు జోన్‌ 9 డీసీపీ మంజునాథ్‌ షింగే. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే.. దానికి ఈ భార్యాభర్తలే బాధ్యత వహించాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీచేశారు. 

ఇదిలా ఉంటే.. హనుమాన్‌ చాలీసా పఠించాలంటూ సీఎం ఉద్దవ్‌ థాక్రేకు సవాల్‌ విసిరాడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమెల్యే రవి రానా. అది జరగని పక్షంలో తాను, తన భార్య నవనీత్‌ కౌర్‌ .. అనుచరగణంతో పాటు మాతోశ్రీ బయట హానుమాన్‌ చాలీసా పఠిస్తామని పేరొన్నారు. 

ఈ నేపథ్యంలో ఈ జంటను.. శివ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో రైలు మార్గం గుండా ముంబైకి చేరుకోవాలనుకున్న జంట.. విమానంలో వచ్చింది. ఆపై నందగిరి గెస్ట్‌కు చేరుకోగా.. అక్కడికి చేరుకున్న శివ సైనికులు హనుమాన్‌ చాలీసాతో హోరెత్తించారు. ఈ వ్యవహారంలో రానా దంపతులు వెనక్కి తగ్గారా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సుమారు 500 మంది అనుచరులతో వాళ్లు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు. 

చదవండి: కుష్బుకు రాజ్యసభ బెర్తు దక్కేనా? 

మరిన్ని వార్తలు