విత్‌ డ్రా చేస్కో లేదంటే చంపేస్తాం: ట్రాన్స్‌జెండర్‌కు వేధింపులు

3 Apr, 2021 16:07 IST|Sakshi

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉందని ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థిపై కొందరు దుండగులు బరి తెగించారు. ఆమెను వేధింపులకు గురి చేసి చివరకు ఎన్నికల పోటీ నుంచి విరమించుకునేటట్టు చేశారు. దీంతో ఎన్నికల నుంచి ఆమె విరమించుకుంది. ఆమె నామినేషన్‌ ఉపసంహరించకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ పరిణామం కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగింది. ఆమెను వేధింపులకు గురి చేసింది సొంత పార్టీ నాయకులు కావడం గమనార్హం. 

తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థిగా అనన్య కుమారి అలెక్స్‌ పోటీలో నిలిచింది. దీంతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారారు. మలప్పురం జిల్లాలోని వెంగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ (డీఎస్‌జేపీ) తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. దీంతో చివరకు ఆ వేధింపులు భరించలేక ఆమె నామినేషన్‌ ఉపసంహరించుకుని పోటీ నుంచి విరమించుకుంది.

అయితే ఆ వేధింపులకు పాల్పడిన వారు ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే. డీఎస్‌జేపీ నాయకులు యూడీఎఫ్‌ అభ్యర్థికి పీకే కున్హాల్‌ కుట్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య కుమారి అలెక్స్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని వేధింపులకు పాల్పడ్డారు. వేధించడంతో పాటు అవమానించారని అనన్య బాధపడింది. అనన్య కుమారి మొదటి రేడియో జాకీగా గుర్తింపు పొందారు. న్యూస్‌ యాంకర్‌గా, ప్రొఫెషనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా పేరు పొందారు.

మరిన్ని వార్తలు