ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా..ఏటీఎం రేషన్‌!

16 Jul, 2021 18:55 IST|Sakshi

చండీగఢ్‌: దేశంలో తొలిసారిగా రేషన్‌ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్‌ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రేషన్‌ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్‌ టచ్‌స్క్రీన్‌ ద్వారా పని చేస్తుందని తెలిపారు.

దేశంలోనే మొట్టమొదటి రేషన్‌ ఏటీఎం
ఈ ఏటీఎం మెషీన్‌లో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్‌ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్‌ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ వెల్లడించారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్‌ ఏటీఎం కాగా.. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ మెషిన్‌ కారణంగా పంపిణీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు కనుక రేషన్‌ సరుకుల కొరతను కూడా ఇది తగ్గించనుందని తెలిపారు. ఈ ఏటీఎంలో రేషన్‌ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కాగా ప్రస్తుతం ఫరూక్‌నగర్‌లో ప్రారంభించిన ఏటీఎంలో గోధుమలు మాత్రమే అందుబాటులో  ఉంచినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు