Hardik Patel: ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మరో కాంగ్రెస్‌లా మారుతుందా

30 May, 2022 09:26 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ హార్దిక్ పటేల్‌ సోమవారం బీజేపీలో చేరుతున్నారా..? కాషాయ కండువా క‌ప్పుకోవ‌డానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారంటూ వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై హార్దిక్‌ పటేల్‌ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఫేక్‌ అంటూ చెక్ పెట్టారు. "నేను సోమ‌వారం బీజేపీలో చేరడం లేదు.. అలాంటిదేమైనా జరిగితే మీకు తెలియజేస్తాను" అని పటేల్  మీడియాకు వెల్ల‌డించారు. 

ఇదిలా ఉండగా.. ప్రముఖ పంజాబీ సింగ్‌ సిద్ధూ మూస్‌వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దారుణ ఘటన అనంతరం పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా.. "ఏ ప్రభుత్వమైనా అస్తవ్యస్తంగా పాలన చేస్తే ఇలాంటి విషాద ఘటనలే చోటుచేసుకుంటాయి. కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడి దారుణ హత్య, ఇప్పుడు ప్రముఖ యువ కళాకారుడు సిద్ధూ మూసావాలేను కాల్చి చంపారు.. ఈ ఘటనలు భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా.. పంజాబ్‌కు బాధ కలిగించడానికి కాంగ్రెస్‌లాగా మరో పార్టీగా మారాలనుకుంటున్నారా లేదా ప్రజలకు నిజంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి. సిద్ధూ మూసేవాలాకు నా నివాళి." అని పేర్కొన్నారు.  

కాగా, అంతకు ముందు హార్ధిక్‌ పటేల్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. గుజ‌రాత్ లో పటీదార్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్ధిక్‌ పటేల్‌.. ఎన్నికల సమయంలో ఇలా పార్టీ నుంచి వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడటంతో బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 

ఇది కూడా చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?

మరిన్ని వార్తలు