2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది: హర్ష వర్థన్‌

17 May, 2021 14:28 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం డీఆర్‌డీఓ, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ (2–డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ 2-డీజీ డ్రగ్‌ భారత్‌ను మాత్రమే కాక ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది అన్నారు.

హర్ష వర్ధన్‌ ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మద్దతుతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన కోవిడ్‌ డ్రగ్‌ 2-డీజి మొదటి దేశీయ పరిశోధన ఆధారిత ఫలితం. దీని వినియోగం వల్ల కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడమే కాక ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని కోవిడ్‌ బారి నుంచి కాపాడుతుంది’’ అన్నారు.

ఇక డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఔషధం పౌడర్‌ రూపంలో ఉంటుంది. దీన్ని నీటిలో కలుపుకుని నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్‌ సోకిన కణాలలో పేరుకుపోయి వైరల్‌ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్‌ పెరుగుదలను నిరోధిస్తుంది అని డీఆర్‌డీఓ తెలిపింది.

చదవండి: 2–డీజీ.. గేమ్‌ చేంజర్‌.. అన్ని స్ట్రెయిన్‌ల మీదా పని చేస్తుంది

మరిన్ని వార్తలు