ఫిబ్రవరి నాటికి అదుపులోకి కరోనా!

19 Oct, 2020 19:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కోవిడ్‌-19 నిబంధనలను పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కేవలం 40,000 కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. కేసుల మోడల్‌ను అనుసరించి శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్తల నుంచి ఈ అంచనాకు వచ్చిందని చెప్పారు. మూడు నాలుగు నెలల్లో కరోనా వైరస్‌ తీరు మార్చుకుని ఫిబ్రవరి నాటికి భారత్‌లో బలహీనపడుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

ఇక వ్యాక్సినేషన్‌ పద్ధతులు, సిబ్బందికి శిక్షణ, వ్యాక్సిన్‌ సరఫరాకు రవాణా ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కోవిడ్‌-19పై నిపుణుల కమిటీ చీఫ్‌ పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత మూడు వారాలుగా తాజా కేసులు, మరణాలు తగ్గాయని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ ఇటీవల పేర్కొన్నారు. అయితే శీతాకాలంలో కరోనా వైరస్‌ మరోసారి తీవ్రరూపు దాల్చే అవకాశాలు లేకపోలేదని ఆయన హెచ్చరించారు. చదవండి : భారత్‌లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు