వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా బారిన పడ్డ మంత్రి!

5 Dec, 2020 12:52 IST|Sakshi

నవంబర్‌ 20న కోవాక్సిన్ తీసుకున్న హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి

చండీగఢ్‌: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా 'కోవాక్సీన్' ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్‌ 20న తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా అనిల్‌ టీకాను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్‌ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అంబాలా కాంట్ లోని  సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు అనిల్‌ విజ్‌ తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నవంబర్‌ 20న ఇదే ఆసుపత్రిలో విజ్‌కు కోవిడ్‌-19 టీకా ‘‘కోవాక్సిన్’’‌ ఇచ్చారు. (చదవండి: దేశంలో కొత్తగా 36,652 కరోనా కేసులు)

మూడోదశ మొదటి వాలంటీర్‌గా విజ్‌
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌‌) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడోదశ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా విజ్ ముందుకొచ్చారు. 

మరిన్ని వార్తలు