ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్‌’ కుటుంబం

18 Oct, 2020 06:39 IST|Sakshi

హాథ్రస్‌: భద్రతా కారణాల రీత్యా తాము ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తామని హాథ్రస్‌ బాధిత కుటుంబం చెప్పింది. హాథ్రస్‌ ఘటనలో మరణించిన దళిత యువతి సోదరుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి న్యాయ సాయం అందిస్తున్న సీమా కుష్వాహ కూడా స్పష్టం చేశారు. అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో బెంచ్‌ ఎదుట ఆమె శనివారం హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఈ కేసును ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ తరలించి విచారణ జరిపించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్‌డీఎం అంజలి గంగ్వార్‌ కుటుంబ సభ్యులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ను అందిస్తామని చెప్పారు. పొలంలోకి వెళ్లేందుకు భద్రత కావాలని కుటుంబ పెద్ద అడిగారని, అందుకు అంగీకరించామని అంజలి తెలిపారు. 

మరిన్ని వార్తలు