నేడు హైకోర్టుకు హాథ్రస్‌ బాధిత కుటుంబం

12 Oct, 2020 04:13 IST|Sakshi

లక్నో/హాథ్రస్‌: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ రంజన్‌ రాయ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని  యూపీ అదనపు చీఫ్‌ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వీకే సాహిని హాజరుకానున్నారు.

రంగంలోకి దిగిన సీబీఐ..
హాథ్రస్‌ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్‌కు చెందిన ప్రత్యేక టీమ్‌ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు