బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు షాక్‌

19 Aug, 2021 12:11 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించాలని కోల్‌కత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. 

ఆరు వారాల్లో సిట్, సీబీఐ తమకు నివేదిక అందించాలని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను గవర్నర్‌ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకుందని నివేదికలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు