సహనం కోల్పోతున్నాం.. గంటలో కానివ్వాలి: హిజాబ్‌ వాదనలపై సుప్రీం

22 Sep, 2022 11:45 IST|Sakshi

ఢిల్లీ: హిజాబ్‌ పిటిషన్లపై విచారణలో వాదనలు త్వరగతిన పూర్తి చేయాలని, తాము సహనాన్ని కోల్పోతున్నామంటూ విచారణ కొనసాగిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత తొమ్మిది రోజులుగా సుప్రీం బెంచ్‌ ఈ పిటిషన్లపై వాదనలు వింటూనే ఉంది. అయితే.. బుధవారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి మందలింపు వ్యాఖ్యలు చేసింది. 

గురువారం(ఇవాళ) వాదనలు వినిపించేందుకు ఒక గంట టైం ఇస్తాం. ఆలోపు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు పూర్తిగా వినిపించాలి. వాదనలు మరీ శ్రుతిమించి పోతున్నాయి. ఇంతేసి టైం వృధా చేయడం సరికాదు అని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్షు ధూలియా.. పిటిషనర్లలో ఒకరి తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్‌ హుజేఫా అహ్మదికి గట్టిగానే సూచించారు. 

కర్ణాటక హిజాబ్‌ బ్యాన్‌ వివాదంపై.. సుప్రీం కోర్టులో పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, సల్మాన్‌ ఖుర్సీద్‌ల బృందం వాదనలు వినిపిస్తోంది. ఇక కర్ణాటక ప్రభుత్వం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, కర్ణాటక అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభూలింగ్‌ నవడ్గి, అదనపు సోలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ వాదనలు వినిపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి!

మరిన్ని వార్తలు