-

రఫేల్‌ తొలి భారత పైలట్‌ హిలాల్‌

29 Jul, 2020 02:16 IST|Sakshi
యూఏఈ నుంచి భారత్‌కు వస్తూ  మార్గమధ్యంలో ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకుంటున్న రఫేల్‌ 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్‌ కామడొర్‌ హిలాల్‌ అహ్మద్‌ రాథోడ్‌ చరిత్ర సృష్టించారు. కశ్మీర్‌కు చెందిన హిలాల్‌ అహ్మద్‌ ఫ్రాన్స్‌ నుంచి వస్తున్న తొలి బ్యాచ్‌ రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌ను మార్చే ప్రక్రియలోనూ ఆయన పాలు పంచుకున్నారు.

భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్‌ 2000, మిగ్‌ 21, కిరణ్‌ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్‌ అవర్స్‌ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఘనత సాధించారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్‌నాగ్‌లో హిలాల్‌ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్‌ అబ్దుల్లా రాథోడ్‌ జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్‌లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్‌ను హిలాల్‌ సాధించారు.

మరిన్ని వార్తలు