హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌కు థ్యాంక్స్‌ చెబుతున్న ట్రక్‌ డ్రైవర్లు.. ఎందుకో తెలుసా!

24 Feb, 2023 12:16 IST|Sakshi

సిమ్లా: భారత్‌లో ఇటీవల అదానీ గ్రూప్‌ వెర్సస్‌ హిండెన్‌బర్గ్‌ వివాదం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ నివేదిక కారణంగా అదానీ ఆస్తులు చూస్తుండగానే కరిపోతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈ వివాదాన్ని అస్త్రంగా మార్చుకుని కేంద్రంపై దాడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ట్రక్‌ డ్రైవర్లు హిండెన్‌బర్గ్‌ నివేదికు ధన్యవాదాలు చెబుతున్నారు. అసలు ఈ రిపోర్ట్‌ ట్రక్‌ డ్రైవర్లకు ఏం చేసింది, వారేందుకు థ్యాంక్యు చెప్తున్నారో తెలుసుకుందాం!

థ్యాంక్యూ హిండెన్‌బర్గ్‌
ట్రక్‌ డ్రైవర్లు సిమెంట్‌ సరఫరాకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని,  ఈ కారణంగా ప్లాంట్‌ నడపడం లాభదాయకం కాదని అదానీ సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని గాగల్‌, దార్లఘాట్‌లోని అదానీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్‌ ప్లాంట్‌లను మూసివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని సుమారు 7,000 మంది ట్రక్కు యజమానులు, డ్రైవర్లు వారాల తరబడి  నిరసన ర్యాలీలను మొదలుపెట్టారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం ట్రక్‌ డ్రైవర్లకు.. అదానీ గ్రూప్‌ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 

‘హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిని తర్వాత అదానీ గ్రూప్‌పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న ఈ సంస్థ ఇటువంటి సమయంలో తమ ప్లాంట్‌లను మూసివేస్తే అది తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి అదానీ ప్రతినిధులు ట్రక్‌ డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ సారి సిమెట్‌ సరఫరాకు వసూలు చేస్తున్న మొత్తంలో  10 నుంచి 12 శాతం తగ్గించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ట్రక్‌ డ్రైవర్లు తమ ఆందోళనను విరమించారు. అంతేకాకుండా సిమెంట్ ప్లాంట్‌లను మూసివేయాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, ఇకపై అవి యథావిధిగా పనిచేస్తాయని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అదానీ గ్రూప్‌ వెనక్కి తగ్గిందంటే కారణం.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్లేనని భావించిన ట్రక్‌ డ్రైవర్లు ఈ సందర్భంగా హిండెన్‌ బర్గ్‌ థ్యాంక్స్‌ చెబుతున్నారు.

చదవండి   70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!

మరిన్ని వార్తలు