రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ నగదు.. చెక్‌ చేసుకోండి ఇలా?

14 May, 2021 13:16 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం నేడు రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ 8వ విడత నగదును జమ చేసింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది. 

ఏప్రిల్-జూలై మధ్య, మొదటి విడత, ఆగస్టు-నవంబర్ మధ్య రెండవ విడత, డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడత నగదును జమ చేస్తుంది. ఈ సారి అర్హత గల 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి 8వ విడత కింద రూ.19000 కోట్లకు పైగా నేడు నరేంద్ర మోడి బటన్ నొక్కి జమ చేశారు. మొత్తం 2 హెక్టార్ల కంటే భూమి తక్కువ రైతులు ఈ వార్షిక సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పథకాన్ని 2018 డిసెంబర్‌లో ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం  రైతులకు ఏడు విడతలుగా చెల్లించింది. అయితే, నగదు మన ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే  ఈ క్రింది విదంగా చేయండి.

స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా: 

  • పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఎఫ్‌టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
 

మరిన్ని వార్తలు