ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా?

9 Dec, 2022 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్‌లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్‌ కరీమ్‌ అడిగిన ‍ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 

‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌. 

మోదీ విదేశీ పర్యటన వివరాలు.. 
ఇటీవల జీ20 సమ్మిట్‌ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్‌ 26-28 మధ్య జపాన్‌ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది.

2022 తొలినాళ్లలో యూరప్‌ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్‌ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది.

గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్‌ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. 

2017లో తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది.

ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు