దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల దాడి

26 Feb, 2021 15:17 IST|Sakshi
హిమాచల్‌ ప్రదేశ​ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ (ఫైల్‌ ఫోటో పీటీఐ)

హిమాచల్‌ ప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన

దాడిని ఖండించిన సీఎం.. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

సిమ్లా: బీజేపీ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు. 

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ నేడు తిరిగి ప్రారంభం అ‍య్యింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు. గవర్నర్‌ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

    దత్తాత్రేయ కారు వద్ద ఆందోళన చేస్తోన్న హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్‌ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్‌ చేశారు. 

చదవండి:
మంచుకొండల్లో ఎంజాయ్‌ చేసిన గవర్నర్‌

మరిన్ని వార్తలు