నిద్రమత్తు భార్యతో వేగలేను సార్...

14 Mar, 2023 09:41 IST|Sakshi

కర్ణాటక: భార్య మొద్దునిద్రతో విరక్తి చెందిన భర్త ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అయేషా పర్వీన్‌ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిద్రలేస్తుంది, భోజనం చేసి సాయంత్రం 5.30 పడుకుంటే రాత్రి 9.30 గంటలకు మేలుకుంటుంది. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని భర్త ఇమ్రాన్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ మేరకు బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వంట కూడా చెయ్యదు
ఆమె వంట కూడా చేయదని, తన తల్లి వంటచేసి వడ్డించాలని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఆమె కుటుంబసభ్యులతో దాడిచేయిందని వాపోయాడు. భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని, భార్య ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మొర పెట్టుకున్నాడు.తనపై కొంచెం కూడా ప్రేమ, మమకారం లేదని, ఆస్తిని కాజేయడానికి పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతోందని చెప్పాడు.

ఇటీవల పుట్టినరోజు నెపంతో 20–25 మందిని ఇంటికి ఆహ్వానించి తనపై దాడిచేయిందని ఆరోపించాడు. ఆమెకు పెళ్లికి ముందే రోగాలు ఉండగా వాటిని దాచిపెట్టి ఐదేళ్ల క్రితం తనకు ఇచ్చి వివాహం చేశారని అతడు చెప్పాడు. మామ అరీఫుల్లా, అత్త హీనా కౌసర్‌, బావమరిది మహమ్మద్‌ మొయిన్‌లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు