వ్యాక్సిన్‌ పరీక్షల కోసం హైదరాబాద్‌ ల్యాబ్‌

17 Aug, 2021 04:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీ (సీడీఎల్‌) ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీడీఎల్‌గా మార్చగల సాంకేతిక ఉన్న ల్యాబొరేటరీని ఎంపిక చేయాలని గతేడాది నవంబర్‌లో కేబినెట్‌ సెక్రటరీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది.

ఇందులో భాగంగా రెండు ల్యాబొరేటరీలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) కేంద్రానికి సూచించింది. అందులో పుణేకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీసీఎస్‌), హైదరాబాద్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)లు ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీఎస్‌ను ఈ ఏడాది జూన్‌ 28న సీడీఎల్‌గా ప్రకటించగా, తాజాగా ఎన్‌ఐఏబీని కూడా సీడీఎల్‌గా ప్రకటించారు. వీటికి పీఎం కేర్స్‌ నుంచి నిధులు అందుతాయి. తయారైన ప్రతీ బ్యాచ్‌ వ్యాక్సిన్‌ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో వ్యాక్సిన్‌ బ్యాచ్‌లను విడుదల  చేయడంలో ఆలస్యమవుతోంది.

మరిన్ని వార్తలు