MP Asaduddin Owaisi: ఢిల్లీ పోలీసులకు ఆ దమ్ము లేనట్లుంది: ఒవైసీ మండిపాటు

9 Jun, 2022 18:42 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంతో ఢిల్లీ పోలీసులు, ఎంఐఎం చీఫ్‌.. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఒవైసీ.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారాయన.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్‌ ఒవైసీ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీజేపీ బహిష్కృత నేత నవీన్‌ జిందాల్‌, జర్నలిస్ట్‌ సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్‌, అబ్దుర్‌ రెహమాన్‌, గుల్జార్‌ అన్సారీ, అనిల్‌ కుమార్‌ మీనా పేర్లను సైతం చేర్చారు. ‘‘ఢిల్లీ పోలీసులు సైడ్‌ఇజం లేదా బ్యాలెన్స్ వాద్ సిండ్రోమ్స్‌తో బాధపడుతున్నట్లు ఉన్నారు. ఒక పక్క ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్యపెట్టడానికి.. రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు అసదుద్దీన్‌ ఒవైసీ. 

నా వరకు ఎఫ్‌ఐఆర్‌లో నేరం ఏంటో కూడా పేర్కొనలేదు. ఇలా ఎఫ్‌ఐఆర్‌ను చూడడం ఇదే మొదటిసారి. విద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం.. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ఒక్కటి కాదు. ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌లపై కేసులు పెట్టే దమ్ములేనట్లు ఉంది. అందుకే విషయాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు బహుశా హిందూవాదులను కించపరచకుండా ఈ వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే మార్గం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారేమో అంటూ వరుస ట్వీట్లు చేశారు ఒవైసీ. 

చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేతపై కేసు నమోదు

మరిన్ని వార్తలు