రోడ్లు బాగోలేక మాకు పెళ్లిళ్లు జరుగడం లేదు: సీఎంకు యువతి లేఖ

17 Sep, 2021 17:35 IST|Sakshi

బెంగళూరు: దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు పరిష్కారం తేవాలనుకుంది. ఇందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల బింధు అనే యువతి దావణ్‌గెరె జిల్లాలోని హెచ్‌ రాంపురాలో టీచర్‌గా పనిచేస్తోంది. తమ గ్రామంలో రోడ్లు బాగోలేక పోవడం వల్ల గ్రామంలోని యువతకు పెళ్లిళ్లు కావడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మెకు లేఖ రాసింది. ఇందులో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. రోడ్లు బాగోలేవని, వీలైనంత తొందరగా వాటిని పునురద్దరించాలని కోరింది. అలాగే రోడ్ల మరమ్మత్తులు చేపట్టేవరకు వివాహం చేసుకోనని స్పష్టం చేసింది.
చదవండి: వైరల్‌: బుల్లెట్‌ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్‌

‘మా గ్రామానికి మంచి రోడ్డు కనెక్టివిటీ లేదు. గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. మాలో చాలా మందికి వివాహ సంబంధాలు అందడం లేదు. ఎందుకంటే  ఇక్కడి పిల్లలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. మా ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం.హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది’ బిందు పేర్కొన్నారు.
చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

కాగా బిందు లేఖకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అంతేగాక గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్ శాఖను తక్షణమే పనులు చేపట్టాలని..  జరుగుతున్న పనుల గురించి వారికి తెలియజేయాలని సీఎంఓ ఆదేశించింది. దీని మీద బిందు మాట్లాడుతూ ‘ఈ రోడ్డును బాగు చేయడానికి మా ప్రజాప్రతినిధులకు కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. అందుకే అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను”అని పేర్కొంది.

మరిన్ని వార్తలు