జాతీయ రహదారిపై ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

9 Sep, 2021 19:55 IST|Sakshi

జైపూర్‌: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కేఎస్ భదౌరియా కలిసి ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం మాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్) డ్రిల్ లో భాగంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలోని సట్టా-గాంధవ్‌ జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జాతీయ రహదారిని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా & రహదారి మంత్రి నితిన్ గడ్కరీ కలిసి సంయుక్తంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలో ఐఏఎఫ్ అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన సట్టా-గాంధవ్‌ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావడంతో రక్షణ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 19 నెలల్లో నిర్మించిన సట్టా-గాంధవ్‌ జాతీయ రహదారిపై నేడు జరిగిన ఈఎల్ఎఫ్ విమాన కార్యకలాపాలను వారు వీక్షించారు. ఐఏఎఫ్ కు చెందిన 32 సైనిక రవాణా విమానం, మీ-17వి5 హెలికాప్టర్ కూడా ఈఎల్ఎఫ్ వద్ద దిగాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?)

రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్‌ స్ట్రెచ్‌ను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో సట్టా-గాంధవ్‌ జాతీయ రహదారి మాదిరిగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యుద్ద సమయాలలో ఈ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి అని అన్నారు. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ ఐఎఎఫ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగం చేతులు కలిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ నిర్మాణాన్ని 19 నెలల్లో పూర్తి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. "బహుళ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు. రాజ్ నాథ్ సింగ్ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐఎఎఫ్ విమానాల ల్యాండింగ్ సరికొత్త ఇండియా చారిత్రాత్మక బలంగా నిర్వచించారు.
 

భారత వైమానిక దళానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం మూడు కిలోమీటర్ల విభాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం జాతీయ రహదారిని(196.97 కిలోమీటర్ల పొడవు) భారత్ మాల ప్రాజెక్టు కింద రూ.765.52 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి పనులు జూలై 2019లో ప్రారంభమైతే, జనవరి 2021లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బార్మర్, జలోరే జిల్లాల గ్రామాలను కలుపుతుంది. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని జాతీయ రహదారులు అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ తో పాటు, సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద కుందన్ పురా, సింఘానియా, బఖసర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు.

మరిన్ని వార్తలు