విడాకుల దిశగా సివిల్స్‌ టాపర్స్‌ జంట

22 Nov, 2020 06:46 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ జంట పెళ్లి చేసుకొని రెండేళ్లు తిరిగిందో లేదో విడాకుల కోసం కోర్టుకెక్కింది. అథార్‌ అమీర్‌ఖాన్, టీనా దాబిలు పరస్పర అంగీకారంతో జైపూర్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. లవ్‌ జిహాదీలో భాగంగానే వీరిద్దరి పెళ్లి జరిగిందని హిందూ మహాసభ ఆరోపణలు గుప్పించడంతో ఈ ఐఏఎస్‌ జంట విడాకుల వ్యవహారంపై అందరి దృష్టి పడింది. కశ్మీర్‌కు చెందిన అమీర్‌ఖాన్‌ యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో రెండో స్థానం వస్తే, అదే బ్యాచ్‌లో టీనాకు మొదటి స్థానం, రాష్టపతి మెడల్‌ వచ్చాయి.

2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన వీరిద్దరూ శిక్షణా కాలంలోనే ప్రేమలో పడ్డారు. శిక్షణానంతరం వారిద్దరికీ జైపూర్‌లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. 2018 మార్చిలో అమీర్, టీనా పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. సోషల్‌ మీడియా వేదికల్లో టీనా తన పేరులో ఉన్న ఖాన్‌ను తొలగించడంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నట్టు అందరికీ అర్థమైంది. అదే సమయంలో అమీర్‌ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికల్లో టీనాని అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు ఏకంగా విడాకుల కోసం పిటిషన్‌ వేశారు. 

మరిన్ని వార్తలు