కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్‌ వేవ్‌ రాకపోవచ్చు: విజయరాఘవన్‌ 

7 May, 2021 20:57 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ అనివార్యం:  మాటమార్చిన విజయరాఘవన్‌

అన్ని ప్రదేశాల్లోనూ కాదు, అసలు రాకపోవచ్చు

సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ కే విజయరాఘవన్‌ వెనక్కి తగ్గారు.. అవసరమైన చర్యలు తీసుకుంటే కరోనావైరస్ మూడో దశను ఓడించలగమంటూ తాజాగా చెప్పుకొచ్చారు. వైరస్‌ థర్డ్‌ వేవ్‌ ఎపుడు  ఎలా వస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం ఖాయమని ప్రకటించిన రెండు రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కఠిన చర్యలు తీసుకుంటే, మూడో వేవ్‌ అన్ని ప్రదేశాలలోనూ రాకపోవచ్చు. అసలు ఎక్కడా రాకపోవచ్చన్నారు. స్థానిక స్థాయిలో ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో, ప్రతిచోటా ఎంత బాగా ఆంక్షలను,  మార్గదర్శకాలను అమలు చేస్తారనేదానిపై వైరస్‌ తీవ్రత  ఆధారపడి  ఉంటుందని విజయరాఘవన్  చెప్పుకొచ్చారు.   

దేశంలో రెండో దశలో కరోనా  రోజురోజుకూ విజృంభిస్తోంది. సగం కేసులు లెక్కల్లోకి రావడం లేదని విమర్శలున్నప్పటికీ, రోజుకు 4లక్షల కేసులకు తగ్గడం లేదు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌దొరకక, ఆక్సిజన్‌, మందుల కొరతతో బాధితులకు దిక్కుతోచడం లేదు. చిరవకి చనిపోయిన తమ ఆత్మీయులను గౌరవంగా సాగనంపేందుకు శ్మశానవాటికలు కూడా ఖాళీ లేని పరిస్థితి. 

కాగా శుక్రవారంనాటి గణాంకాల ప్రకారం 4,14,188 రోజువారీ కేసులతో దేశం మరో రికార్డును నమోదు చేసింది. 3,915 మరణాలతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,34,083 కు చేరింది.  అధికారిక లెక్కలతో  పోలిస్తే ఇది  ఐదు నుండి 10 రెట్లు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా చెప్పుకుంటున్న దేశం తగినంత టీకాల ఉత్పత్తి, పంపిణీకి అష్టకష్టాలు పడుతోంది. 15.7 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చామని, ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ టీకాల రేటు ఇటీవలి రోజుల్లో బాగా పడిపోవడం గమనార్హం.

చదవండి :  కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పారేయాల్సిందే!
కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదు: సంచలన హెచ్చరికలు

మరిన్ని వార్తలు