జేఈఈ టాపర్స్‌ దృష్టి... ఐఐటీ బాంబే వైపే

25 Sep, 2022 06:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022లో టాప్‌–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్‌–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు.

జాయింట్‌ సీట్‌ ఎలొకేషన్‌ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో టాప్‌–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్‌–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్‌–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్‌–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్‌–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్‌ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే.

మరిన్ని వార్తలు