ఐఐటీ జామ్‌ 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్‌

27 Jul, 2021 21:01 IST|Sakshi

జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌)–2022 షెడ్యూల్‌ విడుదల

జామ్‌తో ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశం

20 ఐఐటీలు, ఐఐఎస్‌సీ–బెంగళూరులో ఉన్నత విద్య చదివే అవకాశం

ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్‌ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్‌ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులకు ఎంతో డిమాండ్‌ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్‌లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్‌–2022 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్‌తో ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌.. 

ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్‌ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్‌ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ మొదలు.. బీటెక్‌ ఉత్తీర్ణులు రాసే గేట్‌ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్‌ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్‌డ్, లేదా గేట్‌ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్‌!!

జామ్‌ అంటే
జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌నే సంక్షిప్తంగా జామ్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్‌–2022 షెడ్యూల్‌ను ప్రకటించింది. 

అర్హత
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్‌ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్‌లు
జామ్‌లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్‌సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ స్థాయి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్‌లతోపాటు ఐఐఎస్‌సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్‌ పొందొచ్చు. 

కోర్సులు
► జామ్‌లో సాధించిన స్కోర్‌తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్‌ ఇన్‌ ఎకనామిక్స్‌(రెండేళ్లు); జాయింట్‌ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ; పోస్ట్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌; ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. 

► వీటితోపాటు ఐఐఎస్‌సీ బెంగళూరులో బయలాజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అందుబాటులో ఉంది. జామ్‌ స్కోర్‌ ఆధారంగా ఈ ఇన్‌స్టిట్యూట్‌ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్‌సీ బెంగళూరు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. 

ఏడు పేపర్లలో పరీక్ష
జామ్‌ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్‌; జియాలజీ; మ్యాథమెటిక్స్‌;మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌; ఫిజిక్స్‌. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. 

మూడు విభాగాలు
► జామ్‌ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. 

► సెక్షన్‌ ఏ: 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు.

► సెక్షన్‌ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి.

► సెక్షన్‌ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. 

► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్‌ పరీక్ష జరుగుతుంది. 
► నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్‌క్యూ, ఎన్‌ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్‌ మార్కులు ఉండవు.

ఆన్‌లైన్‌ విధానంలో సీట్ల కేటాయింపు
జామ్‌లో స్కోర్‌ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌(జేఓఏపీఎస్‌)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్‌ ఐడీ క్రియేట్‌ చేసుకొని.. ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. 

సిలబస్‌.. ప్రిపరేషన్‌
ఐఐటీ–జామ్‌లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. 

కెమిస్ట్రీ
ఫిజికల్‌ కెమిస్ట్రీ: బేసిక్‌ మ్యాథమెటికల్‌ కాన్సెప్టులు, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్, థియరీ ఆఫ్‌ గ్యాసెస్, సాలిడ్‌ స్టేట్, కెమికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ అండ్‌ ఫేజ్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ స్పెక్టోమెట్రి బేసిక్‌ కాన్సెప్టులు, ఆర్గానిక్‌ రియాక్షన్‌ మెకానిజం, సింథటిక్‌ అప్లికేషన్స్,క్వాలిటేటివ్‌ ఆర్గానిక్‌ అనాలసిస్, ఆరోమాటిక్‌ అండ్‌ హెటిరోసైక్లిక్‌ కెమిస్ట్రీ. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో.. పిరియాడిక్‌ టేబుల్, కెమికల్‌ బాండింగ్, షేప్స్‌ ఆఫ్‌ కాంపౌండ్స్, మెయిన్‌ గ్రూప్‌ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్‌ మెటల్స్, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. 

బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్‌ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్‌ ఫిజియాలజీ, బేసిక్‌ బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్‌ స్థాయిలో చదివితే సరిపోతుంది.

ఎకనామిక్స్‌
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్, ఇండియన్‌ ఎకానమీ, మ్యాథమెటిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.

జియాలజీ
ప్లానెట్‌ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్‌ జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీలపై దృష్టి పెట్టాలి.

మ్యాథమెటిక్స్‌
సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌ ఆఫ్‌ రియల్‌ నంబర్స్, ఫంక్షన్స్‌ ఆఫ్‌ వన్‌/టూ/త్రీ రియల్‌ వేరియబుల్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ క్యాల్కులస్, గ్రూప్‌ థియరీ, లీనియర్‌ ఆల్‌జీబ్రా, రియల్‌ అనాలసిస్‌ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.

మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌
మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్‌లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్, డిఫరెన్షియల్‌ క్యాల్కులస్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, మాట్రిసెస్‌ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్, స్టాండర్డ్‌ డిస్ట్రిబ్యూషన్, జాయింట్‌ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్‌ డిస్ట్రిబ్యూషన్, లిమిట్‌ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్‌ ఆఫ్‌ హైపోథీసిస్‌లను అధ్యయనం చేయాలి.

ఫిజిక్స్‌
మ్యాథమెటికల్‌ మెథడ్స్, మెకానిక్స్‌ అండ్‌ జనరల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్‌ అండ్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం, కైనటిక్‌ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్, డివైజెస్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. 

ఐఐటీ–జామ్‌ 2022 ముఖ్య సమాచారం
► ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్‌ 30, 2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 11, 2021
► అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జనవరి 4, 2022
► జామ్‌ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022
► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jam.iitr.ac.in

మరిన్ని వార్తలు