IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో కీచకపర్వం

27 Mar, 2022 04:37 IST|Sakshi

ఎస్సీ స్కాలర్‌పై నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు

నిందితులను ఇప్పటికీ అరెస్ట్‌ చేయని వైనం

చెన్నై: ఐఐటీ మద్రాస్‌లో ఎస్సీ మహిళా రీసెర్చ్‌ స్కాలర్‌పై లైంగిక వేధింపుల పర్వం నాలుగేళ్లు కొనసాగింది. పరిపాలనా విభాగానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్ట్‌ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2016లో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరిన మహిళపై తోటి స్కాలర్‌ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీశాడు. అతనికి ఇద్దరు ప్రొఫెసర్లు వంతపాడారు.

ల్యాబ్‌ పరికరాలనూ వాడుకోకుండా, పరిశోధన చేయకుండా అడ్డు తగిలారు. దారుణంగా తిట్టిపోశారు. 2018, 2019లో జరిగిన ఘోరాలను భరించిన ఆమె 2020లో ఫిర్యాదు చేసింది. దాంతో లైంగిక వేధింపుల ఫిర్యాదుల అంతర్గత కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది. ముగ్గురు తోటి విద్యార్థులు, ఒక ప్రొఫెసర్‌ అనుచితంగా ప్రవర్తించారని తేలింది. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశంతో గతేడాది మైలాపూర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలికి న్యాయం జరిగేదాకా నిందితుల పీహెచ్‌డీ పూర్తి కాకుండా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది.

మరిన్ని వార్తలు