ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ

30 Jul, 2022 15:46 IST|Sakshi

చెన్నై: ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనాసక్తితో ఉన్నట్లు చెప్పింది.

ఆదివారం రాత్రి సమయంలో జరిగిన  ఈ ఘటనపై బాధితురాలి స్నేహితురాలు రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే క్యాంపస్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు సంస్థ సిబ్బంది. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు 300 మంది ఫోటోలను సేకరించారు. అలాగే 35 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా విచారణకు పిలిపించారు. అయితే బాధితురాలు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించింది ఎవరో ఇంకా గుర్తించలేదని సంస్థ తెలిపింది.

ఐఐటీ మద్రాస్‌ గేట్ల వద్ద సరిపడా బందోబస్తు ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రతి 100 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడని తెలిపింది. విద్యార్థుల కోసం బడ్డీ వ్యవస్థ కూడా అందుబాటులో ఉందని, దాని ద్వారా కాల్ చేస్తే సంస్థకు చెందిన బస్సు సెక్యూరిటీ గార్డులతో వెంటనే వస్తుందని వివరించింది.
చదవండి: రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

మరిన్ని వార్తలు