కాకరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో రసగుల్లా..

2 Nov, 2020 19:46 IST|Sakshi

రాంచి‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తీపి అంటే ఇష్టమైన వాళ్లంతా నోళ్లు కట్టేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం రాంచిలోని ఓ స్వీట్‌‌ షాపు నిర్వాకుడు కమల్‌ అగర్వాల్‌ తీపి కబురు అందించాడు. తీపి తినేవారికి రోగనిరోధక శక్తని అందించే రసగుల్లాను ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు. అయితే స్వీట్స్‌తో రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో వాడే పదార్థాలు ఏంటో మీరే చదవండి మరి. ఈ రసగుల్లా తయారికి అగర్వాల్‌ ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు... కాకరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు పదార్థాలను వాడుతున్నాడు. ఈ పదార్థాల్లో విటమిన్‌లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయని జార్ఖండ్‌ ప్రభుత్వ ఆయుష్‌ వైద్యుడు భరత్‌ కుమార్‌ కూడా స్పష్టం చేశారు. (చదవండి: మరో లాక్‌డౌన్‌ వల్ల అన్నీ అనర్థాలే!)

స్వీట్స్‌ షాపు నిర్వాహకుడు కమల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో నా మిఠాయిల వ్యాపారం నిలిచిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. జనాలు కూడా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తినిచ్చే ఉత్పత్తులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పదార్థాలనే ప్రజలంతా కొనుగోలు చేయడం గమనించాను. అందువల్లే ఇమ్యూనిటీ ఇచ్చే ఈ రసగుల్లాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను’  అని చెప్పాడు.  అయితే ఇవి తయారు చేసిన మొదల్లో చాలా తక్కువమంది ఈ రసగుల్లాలను కోనుగొలు చేసేవారని, అయితే దుర్గా పూజ తర్వాత వీటి డిమాండ్‌ బాగా పెరిగిందన్నాడు. అంతేగాక ఈ స్వీట్స్‌కు ప్రజల నుంచి విశేష స్పందని వస్తుందని, ఈ దీపావళికి రసగుల్లాలకు చాలా ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. (చదవండి: జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి)

>
మరిన్ని వార్తలు