మరో 47 చైనా యాప్‌లపై నిషేధం

28 Jul, 2020 04:43 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో 47 చైనా మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించింది. జూన్‌ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్‌ యాప్‌ల సంఖ్య 106 కి చేరింది. ఈ 47 యాప్‌లు సైతం, యిప్పటికే నిషేధించిన యాప్‌లకు సంబంధించినవే. శుక్రవారం ఈ యాప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రముఖ గేమింగ్‌ యాప్‌ పబ్‌జీ మొబైల్, ఈ–కామర్స్‌ విభాగానికి చెందిన ఆలీఎక్స్‌ప్రెస్, మరో ప్రముఖ గేమింగ్‌ ‘లూడో వరల్డ్‌’, జిలీ, మ్యూజిక్‌ యాప్‌ రెస్సో యాప్స్‌లనూ నిషేధించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చైనాలోని షావోమీ, టెన్‌సెంట్, అలీబాబా, బైట్‌డాన్స్‌ లాంటి అతిపెద్ద కంపెనీలకు చెందిన యాప్‌లు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్‌లపై కేంద్రం నిఘాపెట్టింది.   చైనా నుంచి పనిచేసే అన్ని టెక్‌ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ లా ఆఫ్‌ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్‌లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది  అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.    

మరిన్ని వార్తలు