భారత్‌ ఎకానమీపై మా వైఖరి మారదు

1 Dec, 2020 08:09 IST|Sakshi

ఇప్పటికి 9 శాతం క్షీణ అంచనాలనే కొనసాగిస్తున్నాం

వృద్ధికి ఇంకా కరోనా కష్టాలున్నాయ్‌

ఎస్‌అండ్‌పీ తాజా నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్‌–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా? లేదా పెరుగుతున్నా యా? అన్న అంశంపై భవిష్యత్‌ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఎస్‌అండ్‌పీ విడుదల చేసిన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...

  •  వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది.  
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్‌–డిసెంబర్‌) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి.  
  • రిటైల్‌ ద్రవ్యోల్బణం సవాలుగా ఉంది.
  • కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించిన తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్‌బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి.

ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుంది: ఫిచ్‌
కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. ‘‘ఆహారం, ఆల్కహాల్‌యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి 2020లో కుటుంబాలు తమ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు’’ అని ఫిచ్‌ వివరించింది.

మరిన్ని వార్తలు