కరోనా వైరస్‌: కలవరపెడుతున్న కొత్త కేసులు.. పాజిటివిటీ రేటు పెరుగుతోంది

15 Jul, 2022 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త వేరియెంట్‌ ముప్పు రాకున్నా.. భారత్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో.. 20, 038 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. దేశవ్యాప్తంగా 47 మంది కరోనాతో చనిపోయారు.

గత ఇరవై నాలుగు గంట్లో దేశవ్యాప్తంగా 20, 038 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే వంద కేసులు తక్కువే(20, 139) నమోదు అయినప్పటికీ.. మరణాలు మాత్రం ఎక్కువే రికార్డు అయ్యాయి. డెయిలీ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉందని, బూస్టర్‌ డోసు పంపిణీ ద్వారా వైరస్‌ కట్టడికి మరింత కృషి చేస్తామని కేంద్రం ప్రకటించుకుంది.

సరిగ్గా 145 రోజుల తర్వాత భారత్‌లో గురువారం 20వేల మార్క్‌ దాటాయి కొత్త కేసులు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1, 39, 073కి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరడం, పాజిటివిటీ రేటు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేస్తోంది.

కరోనాతో ఇప్పటివరకు 5, 25, 604 మంది మృతి చెందారు. జనజీవనం సాధారణంగా మారినప్పటికీ వ్యాక్సినేషన్‌ ప్రభావంతో కేసులు తక్కువగా నమోదు అవుతుండగా.. చాలామంది టెస్టులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త వేరియెంట్‌ రాకుంటే భారత్‌ కరోనా గండాన్ని దాటినట్లేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు