మే 15 కల్లా పతాక స్థాయికి కరోనా కేసులు

23 Apr, 2021 20:41 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. కొత్త కేసుల విషయంలో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కరోనా మహమ్మరీ ఇలాగే కొనసాగితే దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి చేరుకొనున్నట్లు ఐఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదే స్థాయిలో కొనసాగితే మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుకుంటాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరు కల్లా ఈ రాష్ట్రాలలో కేసులు తగ్గవచ్చు అని శాస్త్రవేత్తల అంచనా. మే నెలాఖరు వరకు గణనీయంగా తగ్గుతాయి అని ఐఐటీ కాన్పూర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ తెలిపారు.

చదవండి: కోవిడ్‌ టీకా పాలసీపై సోనియా గాంధీ ఆగ్రహం

మరిన్ని వార్తలు