కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డు

5 Sep, 2020 09:54 IST|Sakshi

దేశంలో 40 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31,07,223. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 0.5 శాతం మంది పేషంట్లు మాత్రమే వెంటిలేటర్‌ ద్వారా, 2 శాతం మంది ఐసీయూలో, 3.5 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ సపోర్టుతో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, 63,89,057 కరోనా కేసులతో అమెరికా, 40,91,801 కేసులతో బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 40,23,179 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. కేసులు నమోదవుతున్న తీరును బట్టి చూస్తే నేడో రేపో భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరుకుంటుంది.
(చదవండి: సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. ఇప్పుడప్పుడే అంతం కాదు!)

మరిన్ని వార్తలు