గత 50 రోజుల్లో అత్యంత కనిష్టం

1 Jun, 2021 05:42 IST|Sakshi

దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల

గత 24 గంటల్లో కొత్త 1,52,734 కేసులు

91.60 శాతానికి పెరిగిన రికవరీ రేటు

సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా కొత్త కేసులు నమోదవడం గత 50 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  2,80,47,534కు చేరుకుంది. అయి తే, కోవిడ్‌ మరణాల సంఖ్య ప్రతిరోజూ ఇంకా మూ డువేల పైనే నమోదవుతోంది. గత 24 గంటల్లో 3,128 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,29,100కు పెరిగింది. మరోవైపు, రోజు వారీ కొత్త కేసుల సంఖ్య కంటే రోజువారీ రికవరీల సం ఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలా గత 18 రోజులుగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం.

పాజిటివిటీ రేటు 9.07%
దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,26,092కు తగ్గింది. ఆదివారం దేశంలో 16,83,135 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 34,48,66,883కు పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 9.07 శాతంగా నమోదైంది. గత ఏడు రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,38,022 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,56,92,342కు పెరిగింది. రికవరీ రేటు 91.60 శాతానికి పెరగడం గమనార్హం. అదే సమయంలో మరణాల రేటు 1.17 శాతంగా నమోదైంది. 

>
మరిన్ని వార్తలు