రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

30 Jul, 2022 15:14 IST|Sakshi

తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. శనివారమే అతడ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం బాధితుడు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని మంత్రి తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుని కుటుంబసభ్యుల్లో ఎవరికీ మంకీపాక్స్ సోకలేదని, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు. అలాగే మంకీపాక్స్ బారినపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు.

కేరళ కొల్లం జిల్లాకు చెందిన మంకీపాక్స్ తొలిబాధితుడికి జులై 14న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఆ తర్వాత కేరళలోనే మరో రెండు కేసులు వెలుగుచూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చినవారే. మంకీపాక్స్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య ఇప్పటికే తెలిపింది.ఈ మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇది స్మాల్‌పాక్స్ తరహా వ్యాధి అని ప్రాణాంతకం కాదని పేర్కొంది.
చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు.. మరాఠీ గర్వాన్ని అవమానించారు

మరిన్ని వార్తలు