మన ఆయుర్దాయం మరో పదేళ్లు!

17 Oct, 2020 04:44 IST|Sakshi

లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని చెప్పారు.

► 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది.
► కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది.
► భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) ప్రబలుతున్నాయి
► గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి.
► 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు),
► పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి.
► దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

ఊబకాయంతో కరోనా తీవ్రం
భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రజల ఆయుర్దాయాలు పెరిగాయని, అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని అ«ధ్యయనం సహరచయిత గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ అలీ మొక్‌దాద్‌ చెప్పారు. ఊబకాయం, డయాబెటిస్‌ వంటి వాటితో కరోనా వైరస్‌ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. భారత్‌లో ఒకప్పుడు మాతా శిశు మరణాలు అత్యధికంగా ఉండేవని, అవిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు.

మరిన్ని వార్తలు