మెడికల్‌ టూరిజం హబ్‌గా భారత్‌

29 May, 2022 05:32 IST|Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

భోపాల్‌: ప్రపంచదేశాల్లో భారత్‌లోనే తక్కువ ధరకి వైద్య చికిత్స లభిస్తోందని, అందుకే, ఇరుగు పొరుగు దేశాల వారు మన దేశంలో చికిత్స చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. భారత్‌లో మెడికల్‌ టూరిజం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శనివారం ఆరెస్సెస్‌ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం–ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశంలో ఆస్పత్రుల్లోనే చవగ్గా వైద్య చికిత్స చేస్తున్నారని చెప్పారు.

ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల్లో స్థానికుల కంటే విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి త్వరితగతిన వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, వైద్యుల కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇటీవల తాను పర్యటించిన దేశాల్లో నాయకులందరూ భారత్‌ వైద్య రంగం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారని, వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మన దేశంలో అత్యంత సులభంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉండడంతో మెడికల్‌ టూరిజం హబ్‌గా మారుతోందని అన్నారు.

మరిన్ని వార్తలు