జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్‌

22 Dec, 2020 13:49 IST|Sakshi

4 ఏళ్లలో 62 శాతం వృద్ధి

 టాప్‌లో మధ్యప్రదేశ్‌

ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: జంతు ప్రేమికులకు సంతోషం కలిగించే వార్త. దేశంలో చిరుత పులుల సంఖ్య గత నాలుగేళ్లలో 62 శాతం పెరిగింది. భారత్‌లో చిరుత పులుల జనాభా క్రమంగా పెరుగుతోందని పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ చెప్పారు. 2014లో 8 వేలున్న చిరుతలు, 2018కి 12వేలను దాటాయని తెలిపారు. కెమెరా ట్రాపింగ్‌ పద్ధతిలో చిరుతల జనాభాను లెక్కించినట్లు ‘‘స్టేటస్‌ ఆఫ్‌ లియోపార్డ్స్‌ ఇన్‌ ఇండియా 2018’’ నివేదిక విడుదల సందర్భంగా ఆయన వెల్లడించారు. పులులు, ఆసియా సింహాల బాటలోనే చిరుతల సంఖ్య కూడా పురోగమన దిశగా పయనిస్తోందన్నారు. భారత్‌ పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య పెంపుదలకు చేస్తున్న కృషికి వన జంతువుల జనాభా పెరగడమే నిదర్శమని చెప్పారు.

నివేదిక ప్రకారం 2018లో మధ్యప్రదేశ్‌లో 3421, కర్ణాటకలో 1783, మహారాష్ట్రలో 1690తో పాటు ఇతర రాష్ట్రాల్లోని చిరుతల మొత్తం సంఖ్య 12852కు చేరింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే తూర్పు కనుమలు, మధ్య భారతంలో 8071, పశ్చిమ కనుమల్లో 3387, శివాలిక్‌ మరియు గంగా మైదాన ప్రాంతంలో 1253, ఈశాన్య పర్వతాల్లో 141 చిరుతలున్నాయి. సగానికి పైగా చిరుతలు మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జనారణ్యంలో మనుషుల చేతికి చిక్కి, రోడ్డు  ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ చిరుత పులుల సంఖ్య పెరగడం గమనార్హం. (చదవండి: భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!)

>
మరిన్ని వార్తలు