షింజో అబే: ఆత్మీయుడికి నివాళిగా భారత్‌ సంతాప దినం.. ప్రధాని భావోద్వేగం

8 Jul, 2022 15:54 IST|Sakshi

టోక్యో: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 

నా ప్రియమైన మిత్రుడు షింజో అబే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. భారతదేశం-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ మక్కువ చూపే ఆయన( షింజోను ఉద్దేశించి..) జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టోక్యోలో నా ప్రియమిత్రుడితో దిగిన రీసెంట్‌ ఫొటో అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ ఉంచారు.

ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం కొనసాగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, తాజా పర్యటనలోనూ ఆయనతో ఎన్నో కీలకాంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ.. షింజో అబే సేవలను గుర్తు చేసుకున్నారు.  


చైనా అంటే డోంట్‌ కేర్‌
చైనా దుష్టపన్నాగాలను ముందే ఊహించిన వ్యక్తి, చైనా అంటే బెణుకు లేని నేతగా షింజో అబేకి ఓ పేరుంది. అలాగే భారత్‌తో మైత్రి బలపడడానికి అబే కృషి ఎంతో దాగుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు ఉన్న టైంలో.. ఆయన నాలుగసార్లు భారత్‌కు వచ్చారు. ఇది చాలూ.. ఆయనకు భారత్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. ఆ సమయంలో భారత్‌ ఆతిథ్యాన్ని ఆస్వాదించడంతో పాటు మోదీ సర్కార్‌తో ఆయన కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు.

అంతేకాదు.. ప్రపంచబ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులు చైనాకు భయపడి.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు వెనుకంజ వేశాయి. ఆ సమయంలో.. సుమారు 13 వేల కోట్ల రూపాయాలను ఈశాన్య రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు షింజో అబే. 2014లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొ‍ని.. ఆ గౌరవంద దక్కించుకున్న జపాన్‌ ప్రధానిగా నిలిచారాయన. అలాంటి ఆత్మీయుడి కోసం జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి.. శనివారం నివాళి అర్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు