న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్లు తమ దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు యథావిథిగా కొనసాగడం గమనార్హం.