‘మీకేం వీటో పవర్‌ ఇవ్వలేదు’.. చైనాకు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

1 Dec, 2022 21:21 IST|Sakshi

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్‌- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్‌’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్‌. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్‌ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్‌’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్‌-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్‌ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: వీడియో: గుజరాత్‌ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్‌! ఎందుకంటే..

మరిన్ని వార్తలు