గ్లోబల్ సౌత్ సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ‘గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం గ్లోబల్ సౌత్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. కోవిడ్–19 మహమ్మారి, ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని గుర్తుచేశారు.
వాతావరణ సంక్షోభం, అప్పుల సంక్షోభానికి కారణమయ్యే ప్రపంచీకరణను అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకోవడం లేదన్నారు. అస్థిరమైన భౌగోళిక రాజకీయాల వల్ల మన దేశాలు అభివృద్ధిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థలను మూలం నుంచి సంస్కరించాలని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ సదస్సులో 120కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.