యాసిన్‌ మాలిక్‌ శిక్ష: ఇస్లామిక్‌ దేశాల కూటమి విమర్శలపై భారత్‌ ఆగ్రహం

28 May, 2022 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్‌ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. 

యాసిన్‌ మాలిక్‌ శిక్ష విషయంలో భారత్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్‌ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది.  అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. 

ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్‌ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్‌కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్‌సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు.

చదవండి: Yasin Malik: యాసిన్‌కు మరణశిక్ష ఎందుకు వేయలేదు!

మరిన్ని వార్తలు