ఆర్మీ ఆధునీకరణకు రూ.13,165 కోట్లు

30 Sep, 2021 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ. 13,165 కోట్ల కేటాయింపులకు రక్షణశాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్‌ మార్క్‌–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) సంస్థ హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేసినట్టుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

రూ.7,523 కోట్లతో అర్జున్‌ ట్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే హెలికాప్టర్ల కొనుగోలుకి రక్షణ శాఖ భారీగా కేటాయింపులు జరిపింది. డబుల్‌ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తమ్మీద భారత్‌ ఆర్మీ ఆధునీకరణ కోసం రూ.13,165 కోట్లు కేటాయింపులు జరిపితే, అందులో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని ఆ ప్రకటన వివరించింది.

మరిన్ని వార్తలు